లిబియా రాజధాని ట్రిపోలీలో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. కొరంథియా హోటల్ దగ్గర బాంబులు అమర్చిన కారును పేల్చి, ఆ తర్వాత హోటల్ సిబ్బంది మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించారు. ఆ తర్వాత హోటల్లోకి దూసుకువెళ్ళిన ఉగ్రవాదులు ఐదుగురు విదేశీయులను కాల్చి చంపారు.
ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు సమాచారం. వీరంతా మాస్కులు ధరించి బీభత్సం సృష్టించారు. ఈ దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. తమ సంస్థ సభ్యుడి హత్యకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు చెప్పింది. లిబియా ప్రభుత్వ దళాలు రంగంలోకి దిగి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
హోటల్లో ఉన్న పలువురు విదేశీయులను బందీలుగా పట్టుకుని వున్న తీవ్రవాదులు ముసుగులు వేసుకుని, బుల్లెట్ ప్రూఫ్ ధరించి ఉన్నట్టు హోటల్ నుంచి బయటకు వచ్చిన హసన్ అల్ అబే అనే కార్పొరేట్ సేల్స్ మేనేజర్ తెలిపాడు. అంతకుముందు, గార్డులతో గొడవపడిన దుండగులు, హోటల్ను ఖాళీ చేయించారని, పార్కింగ్లో ఉంచిన ఓ కారును బాంబుతో పేల్చారని వివరించాడు.