సరిహద్దుల్లో హై అలర్ట్ :: యుద్ధ సన్నాహాల్లో పాకిస్థాన్... మరి భారత్?
దాయాది దేశాలైన భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల నియంత్రణ రేఖ వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ రీజియన్లో 198 కిలోమీటర్లమేర అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బిఎస్ఎఫ్ బలగాల
దాయాది దేశాలైన భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల నియంత్రణ రేఖ వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ రీజియన్లో 198 కిలోమీటర్లమేర అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బిఎస్ఎఫ్ బలగాలు గస్తీ పెంచాయి. నిఘా పరికరాలతో 24 గంటలూ డేగ కన్నుతో పూర్తి అప్రమత్తంగా ఉంటున్నాయి. మూడంచెల కంచె చుట్టూ పెద్ద ఎత్తున ఫ్లడ్ లైట్లు అమర్చారు.
జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్లోని ఆర్మీ స్థావరంపై పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో ఈ హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూ, సాంబ, కథువా, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 450 గ్రామాలున్నాయి. నాలుగున్నర లక్షల మంది ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది.
మరోవైపు... పాకిస్థాన్ యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయింది. భారత్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న నిర్ధారణకు వచ్చిన ఆ దేశ ఆర్మీ రోడ్లపై యుద్ధ విమానాలతో శిక్షణ చేపట్టింది. ఇందుకోసం ఏకంగా ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్ల మధ్య ఉన్న రహదారిని మూసివేసి ఈ శిక్షణ చేపట్టడం గమనార్హం.
ఇదే అంశంపై ఆ దేశ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ మాట్లాడుతూ... పాకిస్థాన్కు తన భూభాగంలోని ప్రతీ అంగుళాన్నీ రక్షించుకునే సామర్థ్యం ఉందన్నారు. "దేన్నీ వదులుకునే ప్రస్తక్తే లేదు" అని ఆయన స్పష్టం చేశారు. ఖరియన్లోని నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎటువంటి దాడులనైనా ఎదుర్కొనే సత్తా పాకిస్థాన్కు ఉందన్నారు. దశాబ్దాలుగా పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశంగానే ఉందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.