Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాటర్ బోర్డింగ్‌ను తిరిగి అమలు చేయాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

వాటర్ బోర్డింగ్‌ను తిరిగి అమలు చేయాల్సిందే: డొనాల్డ్ ట్రంప్
, సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (13:30 IST)
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ పడతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తీవ్రవాదులపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ నుంచి ఎదురయ్యే సమస్యల్ని అరికట్టాలంటే.. వివాదాస్పద ఇంటరాగేషన్ పద్ధతి వాటర్ బోర్డింగ్‌ను వాడాల్సిందేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. మనమంతా మధ్య యుగంలో ఉన్నట్లుందని.. తనవరకైతే వాటర్ బోర్డింగ్‌ను తిరిగి అమలు చేయాలని కోరుతానని.. అంతకంటే కఠిన పద్ధతులు ఉంటే వాటినీ తిరిగి తీసుకురావాలన్నదే తమ అభిమతమని చెప్పారు.
 
వాటర్ బోర్డింగ్ అంటే.. ఓ వ్యక్తిని ఓటవాలుగా ఉన్న బల్లపై తలకిందకు వచ్చేట్లు పడుకోబెట్టి కాళ్లూ చేతులూ కట్టేసి ముఖానికి ముసుగు తొడుగుతారు. ఆపై ముఖంపై ధారగా నీరు పోస్తారు. విచారణ ఎదుర్కొనే వ్యక్తి ఊపిరి పీల్చుకోలేకపోతాడు. ముక్కుల్లో నుంచి నీరు ఊపిరితిత్తుల్లోకి, మెదడు‌లోకి చేరిపోతుంది. ఈ ఇంటరాగేషన్ పద్ధతిని గతంలో గ్వాంటనామా బేలో అమలు చేసినట్టు తెలుస్తోంది. 
 
ఈ వాటర్ బోర్డింగ్ దారుణ హింస. వాటర్ బోర్డింగ్‌ను ఎదుర్కొనే వారు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతారు. తట్టుకుని నిలిస్తే మాత్రం పిచ్చివారైపోతారని సమాచారం. దీన్ని నిషేధించినప్పటికీ, ఇరాక్, ఆఫ్గన్ యుద్ధంలో పట్టుబడ్డ కొందరు ఉగ్రవాదులపై ప్రయోగించినట్టు వార్తలు వెలువడ్డాయి. కాగా, టెక్సాస్ సెనెటర్, రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న టెడ్ క్రూజ్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu