సాధారణంగా భార్యాభర్తలు విడిపోయి విడాకులు తీసుకుంటే భర్త... భార్యకి భరణం ఇవ్వాల్సివుంటుంది. ఆ దంపతులకు గానీ సంతానం ఉన్నట్లైతే పిల్లలకు అయ్యే ఖర్చు అంటే వారికి సంరక్షణ, చదువు, తిండి ఇతరత్రా అవసరాలకు సొమ్ము ఇవ్వాలని కోర్టు తీర్పునిస్తుంది. కానీ కోర్టు మాత్రం ఓ వ్యక్తికి అతని పిల్లలకు ప్రతినెలా పిజ్జాలు ఇవ్వాల్సిందిగా ఆసక్తికర తీర్పునిచ్చింది.
ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... ఇటలీకి చెందిన నికోలా టోసో, నికోలెట్ట జున్ అనే దంపతుల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంతో 2002 సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ దంపతులకి ముగ్గురు పిల్లలు. కోర్టు పిల్లలకయ్యే ఖర్చుని తండ్రే భరించాలని తీర్పునిచ్చింది. వ్యాపారంలో సరైన రాబడి లేకపోవడంతో నికోలా పిల్లల సంరక్షణ కోసం ఇవ్వాల్సిన భరిణాన్నిఇవ్వలేకపోయాడు.
దీంతో అతని భార్య మెట్లెక్కింది. వృత్తి రీత్యా నికోలా పిజ్జా బేకరీ నడుపుతున్నాడు. కాబట్టి డబ్బు ఇవ్వలేని కారణం చేత దాని స్థానంలో 400 యూరోలు విలువ చేసే పిజ్జాలు, ఇతర ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలని కోర్టు తీర్పునిచ్చింది. నికోలా ఇవ్వని పక్షంలో జున్ బేకరీకి వెళ్లి డబ్బులకి బదులుగా పిజ్జాలను తీసుకోవచ్చని ఆదేశించింది.