ఎవరెస్ట్ అధిరోహించి గిన్నిస్బుక్లో చోటు సంపాదించిన మల్లి మస్తాన్బాబు అదృశ్యంపై అటు కుటుంబసభ్యుల్లోనూ, ఇటు జిల్లా ప్రజల్లోనూ టెన్షన్ నెలకొంది. 76 గంటలుగా సమాచారం లభ్యం కాక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘం మల్లి మస్తాన్బాబు స్వగ్రామం. పర్వతారోహణపై ఆసక్తితో 2006లో కేవలం 172 రోజుల్లో ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నీ్సబుక్ రికార్డు సాధించారు.
అనంతరం ఎవరెస్ట్ శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రస్తుతం ఆయన నాలుగు నెలలుగా అర్జెంటీనాలోని చిలీ పర్వతారోహణ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడున్నా ప్రతి రోజు ఈ-మెయిల్ ద్వారా సోదరికి సమాచారం ఇచ్చేవారు. అయితే ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి సోదరికి ఎలాంటి సమాచారం అందలేదు. చిలీలో వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు ఆ బృందంలోని సభ్యుల నుంచి సమాచారం వచ్చింది.
మస్తాన్బాబు అదృశ్యం విషయాన్ని కుటుంబసభ్యులు స్థానిక బీజేపీ నాయకుల ద్వారా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విదేశాంగశాఖమంత్రి సుష్మస్వరాజ్తో మాట్లాడి మరిన్ని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మస్తాన్ బాబు అదృశ్యంపై ఉత్కంఠ నెలకొంది.