సుప్రీంకోర్టు ఎదుట హాజరుకావొద్దు : అష్రాఫ్కు సూచన!
, శుక్రవారం, 10 ఆగస్టు 2012 (10:19 IST)
దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై అవినీతి కేసులను తిరిగి తెరవాలన్న తన ఆదేశాలను పాటించనందుకు స్వయంగా కోర్టుకు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసుపై పాకిస్థాన్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రధాని పాటించాల్సిన అవసరం లేదని కొందరు చెపుతుండగా, మరికొందరు మాత్రం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించాలంటూ ప్రధానికి సూచిస్తున్నారు. జర్దారీపై అవినీతి కేసులను తిరగదోడాలన్న తన ఆదేశాలను పాటించనందుకు ఇప్పటికే యూసుఫ్ రజా గిలాని తన పదవిని కోల్పోయిన విషయం తెల్సిందే. తాజాగా కొత్త ప్రధానమంత్రి అష్రాఫ్కు ఈ నెల 27వ తేదీన స్వయంగా కోర్టుకు హాజరుకావాలంటూ సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఎప్పుడు పడితే అప్పుడు సమన్లు జారీ చేయడానికి ప్రధాని సెక్షన్ ఆఫీసర్ కాదు. జడ్జీల మూడ్ను చూసిన తర్వాత కోర్టుకు హాజరు కావద్దని, పార్లమెంటు ప్రతిష్టంను పెంచాలని మేము ప్రధానికి సలహా ఇచ్చినట్టు ప్రధాని రాజకీయ వ్యవహరాల్లో కీలక సభ్యుడైన ఫవాద్ చౌదరి వెల్లడించారు.