ఆస్ట్రేలియాలో హత్యకు గురైన మూడేళ్ళ బాలుడు కేసులో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ హత్యకు బాలుడి ఇంటిలోనే జీవిస్తున్న 29 సంవత్సరాల గుర్వీక్ ధిల్లాన్ ప్రధాన నిందితునిగా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు.
అతని వద్ద జరిపిన విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇంటి తలుపుని యాదృచ్ఛికంగా తన్నడంతో ఆ పక్కనే ఉన్న బాలునికి తగిలి అపస్మారక స్థితిలోకి జారుకున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత బాలుడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఆ తర్వాత మృతదేహాన్ని కారులో ఉంచి మూడు గంటల పాటు డ్రైవింగ్ ఆసీస్ రోడ్లపై తిరిగి చివరకు ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్లాండ్ జంక్షన్, మెల్బోర్న్ ఎయిర్పోర్టు సమీపంలో పడేసినట్టు చెప్పారు.
ప్రథమ చికిత్స ద్వారా బాలుడి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించగా, ఆ చర్యలు ఫలించలేదని నిందితుడు పోలీసులకు వెల్లడించారు. అయితే, ఈ హత్య కేసులో మరిన్ని ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు శోధిస్తున్నారు.
మృత బాలుడిని తరలించేందుకు ఉపయోగించిన కారు, విమానాశ్రయ పరిసర ప్రాంతాలు, వారు నివశించిన ప్రాంతాలను నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గత గురువారం లాలోర్, డేవిడ్ స్ట్రీట్లో తన తల్లిదండ్రులతో నివశిస్తున్న మూడేళ్ళ భారతీయ బాలుడు గుర్షన్ సింగ్ ఛన్నా హత్యకు గురైన విషయం తెల్సిందే.