ఇటీవలి కాలంలో భారతీయ విద్యార్థులపై ఆస్ట్రేలియాలో దాడులు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి.
మెల్బోర్న్లో ఇద్దరు భారతీయ విద్యార్థులపై ఆస్ట్ర్లేలియాకు చెందిన దుండగులు దాడికి దిగారు. దీంతో దేశీయ విద్యార్థులు తీవ్ర గాయాలపాలైనారు.
భారతదేశానికి చెందిన సాయిరతన్ తివారీ, సునీల్ పటేల్ అనే విద్యార్థులపై దుండగులు ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
గాయపడినవారు ప్రస్తుతం చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఇదిలావుండగా దాడులకు పాల్పడ్డవారిని పోలీసులు ఇంకా పట్టుకోకపోవడం గమనార్హం.
సాయిరతన్ తివారీ తన స్నేహితునితో కలిసి ఆదివారం ఆలయానికి దర్శనం నిమిత్తం బయలుదేరి వెళ్ళగా, దాదాపు 22 సంవత్సరాల వయసు కలిగిన ఆస్ట్రేలియన్లు వీరిని అడ్డగించి ఎక్కడికెళుతున్నారని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా తాను ఆలయానికి వెళుతున్నానని చెప్పేబదులు ఇంటికి వెళుతున్నానని తాను సమాధానమిచ్చానని సాయి తెలిపారు. సాయి ఏడాది క్రితం బ్యాచిలర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విద్యనభ్యసించేందుకు మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చాడు.
ఇంతలో తివారీ పోలీసులకు ఫోన్ చేయబోతుండగా దుండుగులు అతనివద్దనున్న సెల్ఫోన్ను లాక్కుని బాగా చితకబాది మరీ వెళ్ళిపోయారు. దీంతో దాడులకు సంబంధించిన విషయమై ఫ్రాన్కటన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదిలావుండగా ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 30 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియన్ల చేతిలో తీవ్ర గాయాలపాలైనారు.