నేపాల్లో శాంతి స్థాపన కోసం చేపట్టిన చర్యలు ఫలించలేదు. దీంతో ఆ దేశ ప్రధాని ఝులానాథ్ ఖనాల్ తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. నేపాల్లో ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ పార్టీతో సహా మావోయిస్టు పార్టీ కూడా ఆయన రాజీనామాకు గట్టిగా పట్టుబట్టడటంతో ఆయన తలొగ్గక తప్పలేదు.
తన రాజీనామా లేఖను అధ్యక్షుడు రాంభరణ్యాదవ్కు ఆయన ఆదివారం అందజేశారు. వెంటనే రాజీనామాను ఆమోదించాలని కోరగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించాలని ఖనాల్ను దేశాధ్యక్షుడు కోరారు.
కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు, రాజ్యాంగ ముసాయిదాను తయారుచేసేందుకు కొత్త జాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు వీలుగా రాజీనామా చేస్తున్నట్లు ఖనాల్ తెలిపారు.