పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీపై నమోదైన అవినీతి కేసులపై పునర్విచారణకు ఆదేశించే విషయంలో ఆ దేశ ప్రధాన రజా పర్వేజ్ అష్రాఫ్ విఫలమయ్యారు. దీనిపై పాకిస్థాన్ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసు జారీసు జారీ చేసింది.
తమ ఆదేశాల అమలు వైఫల్యంపై ఈ నెల 27వ తేదీలోగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రధానిని ఆదేశించింది. 2007లో పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు మూసివేసిన ఈ కేసులను పునర్విచారణ చేయాలంటూ స్విస్ అధికారులకు లేఖ రాయాలని ప్రధానిని ఆదేశించిన సుప్రీంకోర్టు ఇందుకు రెండు వారాల గడువునిచ్చింది.
అయితే, జర్దారీపై నమోదైన కేసుల విచారణను సెప్టెంబర్ నెల వరకు వాయిదా వేయాలంటూ పాక్ అటార్నీ జనరల్ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి ఆసిఫ్ సయీద్ ఖోసా తోసిపుచ్చారు. జర్దారీ కేసుల పునర్విచారణపై సుప్రీం ఆదేశాలను అమలు చేయనందునే గత ప్రధాని యూసుఫ్ రజా గిలానీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.