ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ జపాన్లో అణు విపత్తును ఎదుర్కొంటున్న ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్ర ప్రాంతంలో సోమవారం పర్యటిస్తున్నారు. ఈ ప్రాంత సందర్శనకు వచ్చిన అత్యంత సీనియర్ విదేశీ నాయకుల్లో బాన్ కూడా ఒకరు. ఫుకుషిమా దైచీ ప్లాంట్కు ఉత్తర దిశలో 40 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికీ రేడియోధార్మికతను చవిచూస్తున్న హరగామ సముద్ర తీరాన్ని కూడా బాన్ కీమూన్ సందర్శిస్తారు.
మార్చి 11న సంభవించిన భూకంపం, సునామీల తర్వాత ఫుకుషిమా విద్యుత్ కేంద్రానికి అన్ని వైపుల 20 కి.మీల పరిధిలో నివాసం ఉంటున్న కుటుంబాలన్నింటినీ ఖాళీ చేయించారు. ఈ విపత్తు సంభవించి ఐదు నెలలు గడిచినప్పటికీ జపాన్ ప్రభుత్వం, టోక్యో ఎలక్టిక్ పవర్ కార్పోరేషన్లు ఈ విద్యుత్ కేంద్రంలోని మూడు రియాక్టర్లను స్థిరీకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
బాన్ కీమూన్ సోమవారం ఫుకుషిమా విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం జపాన్ ప్రధానమంత్రి నొవొటో కన్, విదేశాంగ మంత్రి తకెయకీ మట్సుమోటోలతో సమావేశమవుతారు. బాన్ జపాన్ పర్యటన ముగించుకొని తన స్వదేశం దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఆ దేశాధ్యక్షుడు లీ ముంగ్బక్ను కలుసుకుంటారు.