ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో ఉగ్రవాదులను అణచివేసే ప్రక్రియలో భాగంగా నానాటికీ అల్ఖైదా తీవ్రవాదులపై ఒత్తిడి పెరుగుతోందని అమెరికా తెలిపింది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అల్ఖైదా తీవ్రవాదులు ఎప్పటికైనా ప్రమాదమేనని, దీంతో ఆఫ్గన్, పాక్ దేశాలతోపాటు అమెరికా దేశానికి చెందిన సైనికులు వారిని మట్టుబెట్టేందుకు కంకణం కట్టుకున్నాయని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఉగ్రవాద నిర్మూలన సమన్వయాధికారి డేనియల్ బెంజామిన్ తెలిపారు.
ప్రస్తుతం అల్ఖైదా కష్టాల్లో పడిపోయిందని ఆయన అన్నారు. తన ఉనికిని కాపాడుకునేందుకే పాక్ తదితర ప్రాంతాలలో విధ్వంసాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు.
తమ దేశం నుంచి అదనపు భద్రతా బలగాలను ఆఫ్గనిస్థాన్కు పంపించడంతో అల్ఖైదా తీవ్రవాద సంస్థతోపాటు ఆ సంస్థకు సహాయపడుతున్న ఇతర ఉగ్రవాద సంస్థల మనుగడ కష్ట సాధ్యమౌతుందని ఆయన తెలిపారు.
దీంతో అల్ఖైదా సంస్థను నడిపేందుకు అవసరమైన సొమ్ము ఆ సంస్థ వద్ద లేదన్నారు. ఇతర ప్రాంతాలలో దాడులు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతోందని ఆయన అన్నారు.