ఉత్తర కొరియా శనివారం అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. తమ యురేనియం శుద్ధి కార్యకలాపాలను పునరుద్ధరిస్తామని తెలిపిన ఉత్తర కొరియా విదేశాంగ శాఖ, ఈ క్రమంలో వచ్చే ఫ్లూటోనియంను ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అధికార కొరియా సెంట్రల్ వార్తా సంస్థ వార్తలు వెల్లడించింది.
గత నెల 25న రెండోసారి అణు పరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి మరిన్ని కఠిన ఆంక్షలు ఆమోదించిన కొన్ని గంటల తరువాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. తమకు అమెరికా, దాని మిత్రదేశాలు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే తాము సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని ఉత్తర కొరియా హెచ్చరించడం గమనార్హం.
భద్రతా మండలి ఆంక్షలకు ఉత్తర కొరియా గట్టిగా బదులిస్తుందని, మరో అణు పరీక్ష నిర్వహించడం ద్వారా లేదా మరిన్ని క్షిపణి పరీక్షలు నిర్వహించడం ద్వారా తమ ప్రతిస్పందన ఉంటుందని ఉత్తర కొరియా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదని తెలిపాయి. ఆయుధాల అభివృద్ధికి ఉపయోగించే ఫ్లూటోనియంను తయారు చేసే ప్లాంటును తిరిగి తెరవడం, మే- 25న అణు పరీక్ష నిర్వహించడం, ఆపై వరుసగా క్షిపణి పరీక్షలు చేపట్టడం ద్వారా ఉత్తర కొరియా పశ్చిమదేశాలను కలవరపెట్టిన సంగతి తెలిసిందే.