భారత టెన్నిస్ స్టార్ తన సతీమణి సానియా మీర్జాతో వారానికి రెండుసార్లు టెన్నిస్ ఆడుతానని పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ అన్నాడు. మినీ కోర్టులో సానియాతో టెన్నిస్ ఆడే అనుభూతి కొత్తగా ఉంటుందని, ఆమెతో ఇటీవల మినీకోర్టులో ఓ మ్యాచ్కూడా గెలిచానని మాలిక్ చెప్పుకొచ్చాడు.
సానియాతో తన వివాహం జరిగిన తర్వాత ఆమెను టెన్నిస్ కోర్టుల్లో మెరుగ్గా రాణించాలని ప్రోత్సహిస్తున్నట్లు మాలిక్ తెలిపాడు. అంతేకాకుండా సానియా ప్రాక్టీస్కు ఎంతగానో సహకరిస్తున్నట్లు వెల్లడించాడు.
సానియా మీర్జా టెన్నిస్ మ్యాచ్ల్లో విజయపరంపరను కొనసాగించడంతో పాటు ర్యాంకింగ్స్లోనూ ఎగబాకాలని ఆశిస్తున్నట్లు షోయబ్ మాలిక్ లాహోర్ విమానాశ్రయంలో విలేకరులతో చెప్పాడు. పెళ్లికి తర్వాత సానియా మీర్జా ఆటతీరు మెరుగైందనే విషయాన్ని మాలిక్ మరోసారి నొక్కి చెప్పాడు.
భారత్ ప్రపంచకప్ గెలుచుకోవడంపై మాలిక్ మాట్లాడుతూ.. టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుందని కొనియాడాడు. కానీ భారత్- పాకిస్థాన్ల మధ్య జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్ను వీసా లభించకపోవడంతో ప్రత్యక్షంగా చూడలేకపోయాయని వాపోయాడు. అయితే తాను, సానియా మీర్జా తమ తమ దేశాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నాడు. ప్రపంచకప్లో భారత్ గెలవాలని సానియా ఆశిస్తే.. తాను పాకిస్థాన్ గెలవాలని కోరుకున్నట్లు చెప్పాడు.
ఇక సానియాతో తన వివాహ జీవితం గురించి చెబుతూ.. దుబాయ్లో కాపురం చేస్తున్న తాము చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. తమ సొంత దేశాలైన భారత్-పాకిస్థాన్లకు అప్పుడప్పుడు వెళ్లి వచ్చేందుకే దుబాయ్లో బస చేస్తున్నట్లు మాలిక్ అన్నాడు.