Publish Date: Mon, 24 Nov 2014 (16:13 IST)
Updated Date: Mon, 24 Nov 2014 (16:19 IST)
అవునండి. పుట్టినప్పటి నుంచి గిట్టేంతవరకు కోరికలతో అనేకమంది దేనికోసమైనా పాకులాడుతూనే ఉంటారు. కోరికలకు ఆరంభమే తప్ప అంతమనేది ఉండదు. ఒకదాని తర్వాత మరొకటి పుట్టుకుంటూనే వస్తుంది. ఈ కోరికలను నెరవేర్చుకోవడంలోనే భాగంగా జీవితాన్నే అంకితమిస్తారు.
నిజానికి కోరిక అనేది ఆశలో నుంచే పుడుతుంది. ఆ కోరిక నెరవేరకపోతే తీవ్రమైన నిరాశ కలుగుతుంది. కోరికల ఊబిలో చిక్కినవాళ్లు ఇలా ఆశ నిరాశల నడుమ ఊగిసలాడుతూనే వుంటారు. చివరిశ్వాస విడిచే సమయంలో కూడా, ఏదో ఒక కోరిక నెరవేర్చుకోకుండా పోతున్నట్టుగా అసంతృప్తితో కనిపిస్తారు. ఇలా కోరికలు తీరకుండానే కన్నుమూసే వారు.. కోరికల కారణంగానే తిరిగి జన్మించడం జరుగుతుంది. మళ్లీ కథ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది.
పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే కోరికలు, వాటిని నెరవేర్చుకోవడానికి పడే కష్టాలతోనే మరో మారు జన్మ వృథా అవుతూ వుంటుంది. అందుకే కోరికలను జయించాలనేది మహర్షుల మాట. కోరికలపై అదుపు సాధించిన వాళ్లే భగవంతుడి పాదాలను సమీపించగలుగుతారు.
అందుకే కోరికలను అదుపులో ఉంచుకుని సంతృప్తితో కూడిన జీవితాన్ని కొనసాగించాలి. ఇచ్చినటువంటి జన్మను సార్ధకం చేసుకుని, చివరి నిమిషంలో భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
తనువు చాలించే ముందు మనసులో భగవంతుడి రూపం మినహా మరే కోరిక లేనివాళ్లకి మళ్లీ జన్మంటూ ఉండదు. తిరిగి జన్మంటూ లేకపోవడమే మోక్షమని ఆధ్యాత్మిన నిపుణులు అంటున్నారు.
జీవించినంత వరకూ నానాకష్టాలు పెట్టే కోరికలు.. ఆ తరువాత కూడా మోక్షానికి అవసరమైన అర్హతను లేకుండా చేస్తుంటాయి. అందుకే మోక్షాన్ని కోరుకునే వాళ్లు కోరికలకు దూరంగా ఉండాలనే విషయాన్ని మరచిపోకూడదు.