చెన్నైలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి సరికొత్త రికార్డును సృష్టించింది. హృదయ మార్పిడి ఆపరేషన్లలో ఈ ఆస్పత్రి గర్వించదగ్గ విజయాన్ని సాధించింది. గత 2010లో తొలి హృదయ మార్పిడి ఆపరేషన్ చేపట్టిన ఈ ఆస్పత్రి.. ఇప్పటి వరకు 54 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆస్పత్రి కార్డియాక్, అనెస్థీషియా క్రిటికల్ కేర్ విభాగం అధిపతి డాక్టర్ సురేష్ రావు, కార్డియాక్ సైన్స్ విభాగం డైరక్టర్ డాక్టర్ బాలకృష్ణన్, ఆస్పత్రి సీఈఓ భవదీప్ సింగ్లు సంయుక్తంగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
దేశంలోనే తొలి హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగాన్ని ఈ ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆస్పత్రిలో 2010లో తలి హృద్రోగ ఆపరేషన్ను పూర్తి చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 54 శస్త్ర చికిత్సలను పూర్తి చేశారు. వీటిలో 2010లో ఒకటి, 2012లో 5, 2013లో 7, 2014లో 20, 2015లో ఇప్పటి వరకు 21 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.
ఇలా గుండె మార్పిడి వల్ల జీవదానం పొందిన రోగుల్లో భారత్తో పాటు.. అనేక దేశాలకు చెందిన రోగులు ఉన్నట్టు తెలిపారు. ముఖ్యంగా.. పాకిస్థాన్, ఇరాక్ దేశాలకు చెందిన రోగులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతూ వచ్చిన ఇరాక్ మహిళకు గుండె మార్పిడి ఆపరేషన్ చేయడం మలర్ ఆస్పత్రిలోనే జరిగింది. అలాగే, 58 సంవత్సరాల రోగికి పర్మినెంట్ ఆర్టిఫిసియల్ హార్ట్ ఇంప్లాంట్ను విజయవంతంగా పూర్తి చేశారు. భారతదేశంలోనే తొలి పీడియాట్రిక్ ఆపరేషన్ను రష్యా బాలుడికి మలర్ ఆస్పత్రిలోనే చేయడం గమనార్హం.
గత కొంతకాలంగా అవయవదానంపై మీడియా విస్తృతమైన ప్రచారం కల్పిస్తోందన్నారు. అదేసమయంలో సేకరించే అవయవాలను చెన్నై ఎయిర్ పోర్టునుంచి తమ ఆస్పత్రికి చేరవేసేందుకు ఎయిర్ పోర్టు సిబ్బందితో పాటు నగర పోలీసు శాఖ అందిస్తున్న సహకారం మరువలేనిది. ఇలాంటి అరుదైన సమయంలో గ్రీన్ గారిడార్ను ఏర్పాటు చేసి.. త్వరితగతిన అవయవాలను ఆస్పత్రికి చేరేలా పోలీసులు తమ వంతు సహకారం అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ గుండె మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న వారిలో రెండేళ్ళ నుంచి 66 యేళ్ళ వయస్సు గల బాధితులు ఉన్నారు. ఈ ఆస్పత్రిలోనే 42 యేళ్ళ వ్యక్తికి హెచ్డీఏడీ తరహా ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి వైద్యులు సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. పైగా, హృదయ మార్పిడి ఆపరేషన్లలో ఈ ఆస్పత్రికి దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పేరు ఉన్నట్టు సీఈఓ భవదీప్ సింగ్ పేర్కొన్నారు.