గణపతికి ప్రీతి పాత్రమైన సంఖ్య 21. 21 రకాల పత్రితో పూజించడం ఆచారం. ఈ పత్రిలో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రం ప్రాతిపదికగా ఔషధీయుక్తమైన పత్రితో జపిస్తే, సేవిస్తే ఇటు మోక్షమే కాదు, అటు ఆరోగ్యమూ లభిస్తుంది. ఏకవిశంతి పూజతో, నామాలతో స్వామిని త్రికరణశుధ్థిగా పూజిస్తే సత్వరఫల ప్రదాత అయిన విఘ్నరాజు మనందరికీ శుభాలను ప్రసాదిస్తాడు.
`ఓం ఓషధీవతంతు నమః` అనేది విఘ్నేశ్వరుని సహస్రనామాలలో ఒకటి. ఆ తత్త్వం సమస్త ఓషధులకు, వాని శక్తులకు ఆధారంగా ప్రాశస్త్యాన్ని పొందింది. అంతర్నిహికమైన అద్భుత విజ్ఞాన నిదర్శన పూజాతత్వమే ఈ పత్రిపూజ విశిష్టత.
గణేశపూజలో దుర్వాయుగ్మం (గరిక జంట)తో పూజ విశేష ఫలప్రదమైంది. సహస్రపరమాదేవి.....దుర్వాదుస్వప్ననాశనీ... అంటూ శృతి గరికను దేవి అని ప్రస్తావించింది. ఇది బుద్ధి మీద పని చేస్తుంది. దుస్వప్నాలు నివారిస్తుంది. ఆయుర్వేదంలో పిత్తోద్రేకంలో వచ్చే కలల నివారణకు గరిక కషాయమే ఔషధమని చెప్పబడింది. స్వప్నతుల్యమైన జగత్తులో అజ్ఞాన ప్రేరిత స్వప్నస్థితి నుండి మెళకువను అభిలషిస్తూ కేవలం నిరాకార నిర్గుణ సద్గుణ తత్వబోధనకై గణపతి పూజలో ఋషులు గరికను విధించారని శాస్త్ర వచనం.