న్యూఢిల్లీ : సమకాలీన రాజకీయాల్లో సీనియర్... పైగా అపరచాణక్యం చేస్తారని పేరున్న చంద్రబాబు పీఎం క్యాండిడేట్ అవుతారనే, మోదీ ఆయన్ని తొక్కిపెడుతున్నారా? ఢిల్లీలో చక్రం తిప్పి... రాష్ట్రాలతో లాబీయింగ్ చేసి, ఫ్రంట్లు ఏర్పాటు చేయడంలో అందె వేసిన చేయి చంద్రాబుది అని గమనించే... మోదీ ముందస్తు జాగ్రత్త పడుతున్నారా? ఢిల్లీలో ఇటీవల జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తే, ఇదే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీరు పదేపదే ఢిల్లీకి రావద్దని పీఎం మోదీ ఏకంగా సీఎం చంద్రబాబుకు సూచించినట్లు అందుతున్న సమాచారం ప్రకారం... బాబు ఎక్కడ చక్రం తిప్పేస్తారో అనే భయం బీజేపీని వెంటాడుతోంది.
సుదీర్ఘ కాలం తర్వాత అనూహ్యంగా అధికారం పొందిన పార్టీ బీజేపీ. చాయ్ వాలాగా కెరీర్ ప్రారంభించి, అనూహ్యంగా పీఎం చైర్ లోకి ఎక్కినవారు మోదీ. ఇపుడు ఆయన చెయిర్ని కాపాడుకోవడం మోదీకి ముఖ్యం. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీకి, తనకు అడ్డు లేకుండా చూసుకోవాలనేది మోదీ వ్యూహంగా ఉంది. అయితే, ఫ్రంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్. దానిని కొనసాగించి, కథ నడిపించి, చక్రం తిప్పి... దక్షిణాది, ఉత్తరాది సీఎంలను, జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను కలిసి కొత్త కుంపట్లు పెట్టిన చాణక్యం చంద్రబాబుది.
ఈ సంగతి ముందే గ్రహించిన మోదీ, తాను పీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబుతో జర జాగ్రత్తగా ఉంటున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లి కలిసినపుడే, తన రిజర్వడ్నెస్ని మోదీ ప్రదర్శించారు. అయినా, చంద్రబాబు తాను సీనియర్ పొలిటీషియన్గా... మోదీ తనలాగే కష్టపడతారని, తెలివైన వారని వ్యాఖ్యనించి పక్కకు తప్పుకున్నారు. తర్వాత చాలాసార్లు ఏపీకి, రాజధానికి నిధుల కోసం పీఎం వద్దకు పోతే ఆయన అపాయింట్మెంట్ అతి కష్టంగా దొరికిన పరిస్థితి.
తీరా పీఎంని కలిస్తే, చాలా రిజర్వ్డ్గా దూరం పెట్టి మొక్కుబడిగా మాట్లాడుతూ వచ్చారు. అసలు మీరెందుకు తరచూ ఢిల్లీకి వస్తున్నారు... ఫోన్లో మాట్లాడొచ్చుగా... నేను గుజరాత్ సీఎంగా ఉండగా, కేవలం రెండుసార్లు మాత్రమే ఢిల్లీకి వచ్చా... అంటూ పీఎం మోదీ చంద్రబాబుకు అన్యాపదేశంగా... బీ కేర్ఫుల్ అని చెప్పినట్లు సమాచారం. ఇలా ఆయన ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ ఎవరెవరిని కలుస్తున్నదీ నిఘా కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఎక్కడ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను, ప్రతిపక్షాలను ఏకం చేసి మూడో కూటమి కుంపటి పెడతాడో అని చెక్ చేసుకోవడం బీజేపీ అగ్రనేతల వంతయ్యింది.
ఇపుడు తాజాగా చంద్రబాబు తాను పీఎం కావడం పెద్ద సమస్య కాదని వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో మోదీ గుండెల్లో రాయి పడిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబుకు అనుకూలించే ఏ పనీ రాష్ట్రానికి చెయ్యకూడదనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే తరహా ఆలోచనలతో అమరావతికి నిధులు ఇవ్వకపోవడం, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకపోవడం, రాష్ట్రానికి, ప్రాజెక్టులకు అసలు నిధులే కల్పించకపోవడం... ఇలా అన్నీ వరసపెట్టి ఖాళీ హాత్కి కారణమని భావిస్తున్నారు. చివరికి చంద్రబాబును వచ్చే ఎన్నికల నాటికి కేంద్రంలో జోక్యం చేసుకోకుండా, రాష్ట్రంలోనూ దెబ్బతినేలా చేయడమే కేంద్రం వ్యూహమని తెలుస్తోంది. మరి ఈ రాజకీయ పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఎలా నెగ్గుకొస్తారో వెయిట్ అండ్ సీ.