కాపుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ నేతలతోను, కాపులను పట్టించుకోని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్తోను కాపు రిజర్వేషన్ నేత ముద్రగడ పద్మనాభానికి ఉన్న పనేంటని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. హైదరాబాద్కు వచ్చిన ముద్రగడ పలువురు కాంగ్రెస్ నేతలను కలవడంపై చినరాజప్ప స్పందిస్తూ... ఆయన రోజుకో లేఖను రోజుకో రకంగా ఎందుకు రాస్తున్నారో తెలియడం లేదన్నారు.
కాపు కార్పొరేషన్ ద్వారా ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నా పోరాటాలు ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలను కలవడంలో ఆంతర్యం ఏమిటో ముద్రగడ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నారన్న కక్షతోనే నారా లోకేష్ పై వైకాపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని చినరాజప్ప మండిపడ్డారు.
నారా లోకేష్ను విమర్సించే అర్హత అంబటి, బొత్స సత్యనారాయణకు లేదన్నారు. అనవసర ఆరోపణలు, విమర్శలు చేయడం వైసిపి మాత్రమే తెలుసునన్నారాయన. తుని ఘటనపై విచారణ వేగవంతంగా జరుగుతోందని, నిందితులు ఎవరైనా సరే శిక్షిస్తామన్నారాయన. కాపులకు రిజర్వేషన్లపై ముద్రగడ ఇప్పటికైనా రార్థాంతం చేయడం మానుకోవాలని, రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబునాయుడు ఏవైతే హామీలిచ్చారో వాటనన్నింటినీ నెరవేరుస్తామన్నారు. ముద్రగడ వెనుకల జగన్ హస్తం ఉందని విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే ఆ విషయం విచారణలో తేలుతుందన్నారు.