Publish Date: Thu, 21 May 2026 (08:41 IST)
Updated Date: Thu, 21 May 2026 (08:37 IST)
స్నానం చేయమన్నందుకు ఓ యువతి మనస్తాపం చెంది బావిలో దూకేసింది. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు ఆ బాలికను ప్రాణాలతో రక్షించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని అసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు...
ఎస్హెచ్వో బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ పట్టణంలోని సందీప్నగర్లో నివాసముంటున్న స్వర్ణలత, పోచీరాంల కుమార్తె సాత్విక. ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. బుధవారం ఇంట్లో స్నానం చేయమని బాలికను కుటుంబ సభ్యులు మందలించారు. మనస్తాపం చెందిన బాలిక వెంటనే పక్క వీధి బజార్వాడిలోని బావి వద్దకు వెళ్లి దూకింది. నీటిలో కొట్టుకుంటూ కేకలు వేసింది. గమనించిన కాలనీవాసులు వెంటనే 100కు డయల్ చేశారు.
స్పందించిన ఎస్హెచ్వో వెంటనే పోలీసులను, అగ్నిమాపక శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఫైర్ ఫైటర్ నరేష్, ఫైర్మెన్ రాము, చోదకుడు ప్రవీణ్కుమార్లు.. తాడు, ఇతర రక్షణ పరికరాలతో వచ్చారు. రాము తాడు సహాయంతో.. బావిలో దిగి బాలికకు రక్షణ జాకెట్ తొడిగి బయటకు లాగారు. కాలికి గాయమైన బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.