పాపం ఎన్నో కష్టాల్లో వున్నాడు అని దయతలచి మధ్యవర్తిగా వుండి ఓ యువకుడికి డబ్బు ఇప్పించినందుకు ఆమె ప్రాణాలు తీసాడు. తనకు పడక సుఖం ఇస్తే డబ్బులు ఇస్తానంటూ కండిషన్ పెట్టినట్లు ఆరోపణలు వున్నాయి. ఆ వివాహిత అతడిని గట్టిగా నిలదీసేసరికి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నరసింహరావు, ప్రమీల ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐతే ఇద్దరి మధ్య కొన్ని గొడవల కారణంగా 2015లో విడిపోయారు. విడిపోయే ముందు పాల్వంచలో శ్రావణ్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు వున్నారు ఈ జంట. అప్పట్లో శ్రావణ్ తనకు ఆర్థిక కష్టాలు వున్నాయని ప్రమీలను బ్రతిమాలాడాడు. దీనితో ప్రమీల మధ్యవర్తిగా వుండి శ్రావణ్ కు డబ్బులు ఇప్పించింది.
ఐతే భార్యాభర్తలు విడిపోయాక ప్రమీల ఖమ్మంలో వుంటోంది. ఈ క్రమంలో తను మధ్యవర్తిగా వుండి డబ్బులు ఇప్పించినందుకు ఆ డబ్బు ఇచ్చినవారు ప్రమీలపై ఒత్తిడి తెచ్చారు. దీనితో ఆ డబ్బు ఇవ్వాలంటూ శ్రావణ్ను అడిగింది. ఐతే తనతో గడిపితే ఆ డబ్బు ఇస్తానంటూ శ్రావణ్ ఆమె పట్ల కామాంధుడుగా మారాడు. ఈ విషయంపై ప్రమీల అతడిని గట్టిగా నిలదీయడంతో అతడే ప్రమీలను హత్య చేయించి వుంటాడని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు.