విషపు పాములే కన్నబిడ్డల్ని చంపుతాయంటారు. ఐతే మనుషులు మాత్రం ఆ పనిచేయలేరు. కన్న మమకారం కారణంగా పిల్లలు తమపై ఎలాంటి దారుణాలకు తెగబడినా ప్రాణాలు అర్పించేస్తుంటారు. ఐతే అన్నమయ్య జిల్లాలో ఓ తల్లి మాత్రం తన కన్నబిడ్డను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. అంతగా ఆ తల్లిని ఆ కొడుకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసాడు... కారణం ఏమిటో పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట మండలంలో శ్యామలమ్మ నివాసం వుంటోంది. ఈమె పెద్ద కుమారుడు జయప్రకాష్ రెడ్డి ఎంబీఎ ద్వితీయ సంవత్సరం చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసి ఇంటికి వచ్చేసాడు. ఆ తర్వాత జులాయిలా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ నిత్యం తల్లి శ్యామలమ్మను వేధించడం ప్రారంభించాడు.
తనకు డబ్బులు ఇవ్వడంలేదని ఆగ్రహం చెందిన జయప్రకాష్... తన వాటా కింద వచ్చే ఆస్తిని తక్షణమే తనకు పంచి ఇవ్వాలంటూ తల్లిని నిత్యం వేధించడం ప్రారంభించాడు. అతడి వేధింపులు తాళలేని శ్యామలమ్మ కొడుకుని చంపేయాలని నిశ్చయించుకుంది. తన పొలంలో పనిచేసే మహేశ్ అనే యువకుడితో డీల్ కుదుర్చుకున్నది. తన కొడుకుని చంపితే రూ. 6 లక్షలు సుపారీ ఇస్తానంటూ అతడికి చెప్పింది. అడ్వాన్సు కింద రూ. 50,000 నగదు కూడా తీసుకున్న మహేష్ గ్యాంగ్... జయప్రకాష్ రెడ్డిని కూనితోపు సమీపంలో హత్య చేసారు. ఐతే ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్తపడ్డారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి నిందితులను 48 గంటట్లోనే అదుపులోకి తీసుకున్నారు.