ఇంగ్లండ్తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు చిత్తుగా ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాట్స్మెన్లేనని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డారు. మూడో టెస్ట్ మ్యాచ్లో ధోనీ సేన ఇంగ్లండ్ చేతిలో 266 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ఈ ఓటమిపై ధోనీ స్పందిస్తూ.. ఓటమికి బ్యాట్స్ మెన్ వైఫల్యమే కారణమని అన్నాడు.
పేలవంగా అవుటయ్యారని విమర్శించాడు. జట్టులో ప్రతిభకు లోటులేదని, మానసిక దృక్పథంలోనే మార్పురావాలని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఇక, గతకొంతకాలంగా నలుగుతున్న నలుగురు బౌలర్ల వ్యూహంపైనా ధోనీ తన అభిప్రాయం వెలిబుచ్చాడు. ఆ వ్యూహాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.
ఈ మ్యాచ్లో నలుగురు బౌలర్లతో ఎందుకు బరిలో దిగారన్న ప్రశ్నకు బదులిస్తూ, తామెప్పుడూ ఐదో బౌలర్ను తీసుకోలేదని తెలిపాడు. పార్ట్ టైమర్లతోనే నెట్టుకువచ్చేవాళ్ళమని చెప్పాడు. ఇక, ఈ టెస్టులో అద్భుత విజయాన్ని దక్కించుకున్న ఇంగ్లండ్ జట్టు సారథి ఆలిస్టర్ కుక్ మాట్లాడుతూ, మూడో టెస్టులో అన్ని సెషన్లలోనూ ఆధిపత్యం చెలాయించామన్నాడు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చాడు.