విదేశాల్లో టెస్ట్ మ్యాచ్లు ఆడలేకుంటే వన్డే మ్యాచ్లు ఆడుకోవాలంటూ భారత క్రికెటర్లపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ కేవలం 94 పరుగులకే ఆలౌట్ కావడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. టెస్టులు ఆడటం చేతకాకపోతే వన్డేలు మాత్రమే ఆడుకోవాలని అన్నారు. జట్టు మొత్తం కలిసి కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయారని మండిపడ్డారు.
ఇలాంటి చెత్త ప్రదర్శనతో భారతదేశానికి చెడ్డ పేరు తీసుకురాకండని ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేశారు. విదేశాల్లో క్రమం తప్పకుండా విజయాలు సాధించే సామర్థ్యం ప్రస్తుత జట్టుకు లేదంటూ... ధోనీ సేనపై గవాస్కర్ విరుచుకుపడ్డారు. స్వదేశంలో అంతా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి... గెలవడంలో గొప్పేమీ లేదని అన్నారు.
వాస్తవానికి లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత... సిరీస్ గెలిచే అవకాశం వచ్చినప్పటికీ... మన ఆటగాళ్లు దాన్ని దుర్వినియోగం చేశారని అభిప్రాయపడ్డారు. చేసిన తప్పులనే మళ్లీమళ్లీ చేస్తూ బ్యాట్స్మెన్లు మన దేశ పరువును గంగలో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.