Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంగ్లండ్ విజయానికి బాటలు వేసిన రూట్ : తీరుమారని భారత్!

ఇంగ్లండ్ విజయానికి బాటలు వేసిన రూట్ : తీరుమారని భారత్!
, ఆదివారం, 17 ఆగస్టు 2014 (17:51 IST)
తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రూట్ (149 నాటౌట్) జట్టు విజయానికి బాటలు వేయగా, 329 పరుగుల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్.. తన తీరును మాత్రం మార్చుకోలేదు. తమ బ్యాటింగ్ శైలిపై ఎన్ని విమర్శలు ఎదురైనా భారత బ్యాట్స్‌మెన్లు మాత్రం ఎప్పటిలా రెండో ఇన్నింగ్స్‌లోనూ పెవిలియన్‌కు క్యూ కట్టేందుకు పోటీ పడుతున్నారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించీ ప్రారంభంకాగానే భారత్ తన ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. 
 
ఓవల్‌ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మూడో రోజున ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 486 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 329 పరుగుల ఆధిక్యం లభించింది. రూట్ 149 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఇషాంత్ 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. 
 
అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన భారత్ కు ఓపెనర్లు ఘోరమైన ప్రారంభాన్ని ఇచ్చారు. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్‌‌లో మురళీ విజయ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. వెంటనే మరో ఓపెనర్ గంభీర్ కూడా ఔట్ అయ్యాడు. 3 పరుగులు చేసిన గంభీర్ రనౌట్ అయ్యాడు. పుజారా క్రీజులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. 
 
ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్లకు 9 పరుగులు (6.1 ఓవర్లు). ఈ టెస్ట్ మ్యాచ్‌లో కూడా భారత జట్టు ఓడిపోవడం ఖాయం. ఒకవేళ వరుణుడు అడ్డుపడితేనే భారత్ ఓటమి నుంచి తప్పించుకోగలదు. లేదంటే ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-1 తేడాతో కైవసం చేసుకోవడం ఖాయం. తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu