వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గట్టి వార్నింగ్ ఇచ్చింది. నష్టపరిహారం రాబట్టుకునే విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడే ప్రశ్నేలేదని తేల్చి చెప్పింది.
గత ఏడాది అక్టోబర్లో విండీస్ జట్టు భారత పర్యటన నుంచి అర్థాంతరంగా రద్దు చేసుకుని వెళ్ళడం వల్ల కలిగిన నష్టానికిగాను రూ.257.67 కోట్లు చెల్లించాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసింది. నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. విండీస్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరూన్కు భారత బోర్డు తాజాగా మరో లేఖ రాసింది.
వారం రోజుల్లోగా ఈ లేఖపై కరీబియన్ బోర్డు స్పందించకపోతే చట్టపరమైన చర్యలకు దిగనున్నట్టు స్పష్టం చేసింది. పరస్పర ఆమోద్యయోగ్యమైన పరిష్కారం కోసం గత యేడాది అక్టోబర్ 31వ తేదీన బీసీసీఐ రాసిన లేఖపై విండీస్ 40 రోజుల సమయం కోరింది. ఆ సమయం మించి చాలా రోజులు గడచినా.. పరిష్కారానికి చొరవ చూపలేదని ఈనెల 20న రాసిన తాజా లేఖలో బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ గుర్తు చేశాడు.