వడోదరా వన్డే: సెంచరీని పూర్తిచేసిన గౌతం గంభీర్!
వడోదరా వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ గౌతం గంభీర్ అద్భుత సెంచరీని నమోదు చేసుకున్నాడు. 88 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో గంభీర్ సెంచరీ సాధించాడు. ఇది గౌతం గంభీర్ వన్డే కెరీర్లోనే తొమ్మిదో సెంచరీ కావడం గమనార్హం. అలాగే కివీస్తో జరుగుతున్న వన్డే సిరీస్లో వరుసగా రెండో వన్డే గంభీర్ రెండో సెంచరీ నమోదు చేసుకోవడం విశేషం. కివీస్తో వడోదరాలో జరుగుతున్న మూడో వన్డేలో 225 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన భారత్ అద్భుతంగా రాణిస్తోంది. ఓపెనర్ మురళీ విజయ్ 30 పరుగుల వద్ద రనౌట్ అయినప్పటికీ, మరో ఓపెనర్, కెప్టెన్ గౌతం గంభీర్ బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ సాధించాడు. విజయ్ స్థానంలో బరిలోకి దిగిన యంగ్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ (31) గంభీర్కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం గంభీర్ (110), విరాట్ కోహ్లీ (31)లు క్రీజులో ఉన్నారు. ఫలితంగా 31.1 ఓవర్లలో భారత్ ఒక వికెట్ను మాత్రమే కోల్పోయి 178 పరుగులు సాధించింది.