ముక్కోణపు వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బుధవారం పెర్త్ మైదానంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.
234 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు స్కోరు 14పరుగుల వద్ద డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 10 పరుగులు (8 బంతుల్లో 2*4)తో మలింగ బౌలింగ్లో అవుటవగా, మరో ఓపెనర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 48 పరుగుల (63 బంతుల్లో 5*4) మ్యాథ్యూస్ బౌలింగ్లో వెనుదిరిగి వందో సెంచరీ చేయకుండా మరోసారి నిరాశ పరిచాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ 77 (94 బంతుల్లో 8*4, 1*6) అర్థ సెంచరీతో రాణించగా, రోహిత్శర్మ 10 పరుగులు (17 బంతుల్లో 1*4) , సురేష్ రైనా 24 పరుగులు (27 బంతుల్లో 3*4) సాధించారు.
కెప్టెన్ ధోనీ కేవలం నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన జడేజా 24 పరుగులు నాటౌట్ (28 బంతుల్లో 1*4), అశ్విన్ 30 పరుగులు (37 బంతుల్లో 3*4)తో కలసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంక బౌలర్లలో మ్యాథ్యూస్ రెండు వికెట్లు పడగొట్టగా, మలింగ, పెరెరా, డమ్మికా ప్రసాద్ తలా ఒక్కో వికెట్ను తమ ఖాతాలో వేసుకున్నారు.
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాట్స్మెన్లలో దినేష్ చందిమాల్ అత్యధికంగా 64 పరుగులు (84 బంతుల్లో 4*4), చేయగా మాజీ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ తిలక్రత్నే దిల్షాన్ 48 పరుగులు (79 బంతుల్లో 6*4), కెప్టెన్ మహేల జయవర్ధనే 23 పరుగులు, కీపర్ సంగక్కర 26 పరుగులు చేశారు.
చివర్లో మ్యాథ్యూస్ 33 పరుగులతో నాటౌట్ (28 బంతుల్లో 2*4)గా నిలవడంతో శ్రీలంక 233 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో అశ్విన్ ఏకంగా మూడు వికెట్లు సాధించగా, జహీర్ ఖాన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వినయ్ కుమార్, రవీంద్ర జడేజా చెరో వికెట్ను దక్కించుకున్నారు.