ట్వంటీ-20 ప్రపంచకప్: ఆస్ట్రేలియా అద్భుత విజయం!
కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బార్బడోస్లో ఆదివారం జరిగిన సూపర్-8 మ్యాచ్లో శ్రీలంకపై 81 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16.2 ఓవర్లలోనే ఆలౌటై 87 పరుగులకే కుప్పకూలింది. దీంతో కంగారూలు 87 పరుగుల తేడాతో లంకేయులపై గెలిచారు. ఇకపోతే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో వైట్ (89) 49 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఆరు బౌండరీలతో అద్భుత ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. అలాగే మైక్ హస్సీ కూడా 26 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్తో 39పరుగులు సాధించి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంక బ్యాట్స్మెన్లలో ఓ ఒక్క బ్యాట్స్మెనూ ధీటుగా రాణించకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మరోవైపు.. శ్రీలంక బౌలర్లలో రాందివ్ మూడు వికెట్లు తీసుకోగా, మాథ్యూస్ రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఆసీస్ బౌలర్లలో జాన్సన్ మూడు, ననేన్స్ రెండు, స్మిత్ రెండు, క్లార్క్ ఒక వికెట్ను తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా.. శ్రీలంక బౌలర్లను ఆటాడుకున్న ఆసీస్ బ్యాట్స్మెన్ వైట్ (85 నాటౌట్)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.