Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెస్టు ర్యాంకింగ్స్: నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా!

టెస్టు ర్యాంకింగ్స్: నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా!
అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా తన నెం.1 స్థానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌‌ను సమం చేసుకోవడంతో ఒక్క పాయింట్ కోల్పోయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ సేన 128 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. అలాగే దక్షిణాఫ్రికా 117 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది.

ఇక యాషెస్ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ (115) మూడు పాయింట్లు ఎగబాకి మూడో స్థానంలో నిలవగా, యాషెస్ సిరీస్‌లో పేలవమైన ఆటతీరులో ఓటమి చెందిన ఆస్ట్రేలియా (107) ఐదో స్థానానికి పడిపోయింది. తద్వారా శ్రీలంక 109 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది.

అలాగే ఐసీసీ టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, జాక్వస్ కలిస్‌లకు అగ్రస్థానం దక్కింది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌‍లో వీరిద్దరూ 883 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో నిలవగా.. సంగక్కర కేవలం ఒక్క పాయింట్ వెనకబడి మూడో స్థానానికి చేరాడు.

కేప్‌టౌన్‌లో జరిగిన చివరి టెస్టులో 146 పరుగులు చేసిన సచిన్ రెండో టెస్టులోనూ రికార్డు (50వ) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అటు కలిస్ కూడా రెండు సెంచరీలు (161, 109 నాటౌట్) చేసి ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి టాప్‌కు చేరాడు. టెస్టుల్లో నెంబర్‌వన్ స్థానానికి చేరుకోవడం సచిన్‌కిది పదోసారి. 1994లో తొలిసారి ఈ ఘనత సాధించాడు.

Share this Story:

Follow Webdunia telugu