ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే టీమ్ ఇండియా జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. విశ్రాంతి, గాయాల కారణంగా వెస్టిండీస్ పర్యటనకు దూరమైన స్టార్ క్రికెటర్లందరూ మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చారు. సీనియర్ల పునరాగమనంతో టీమిండియా పూర్తి స్థాయి జట్టుతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఈ పర్యటన కోసం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని 17 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు. ఈ వివరాలను బీసీసీఐ కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్ శనివారం వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్కు గంభీర్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కాగా భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్కు జట్టుకు అందుబాటులోకి వచ్చాడు.
సుదీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉన్న యువీకి మరో అవకాశం కల్పించారు. అలాగే, కేరళ స్పీడ్స్టర్ శ్రీశాంత్, పశ్చిమబెంగాల్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహుకు స్థానం దక్కింది. సీనియర్లు వీవీఎస్.లక్ష్మణ్, ద్రావిడ్తో పాటు రైనా జట్టులో కొనసాగనున్నారు. తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాగా విండీస్ పర్యటనలో రాణించలేకపోయిన కీపర్ పార్థివ్ పటేల్, ఓపెనర్ మురళీ విజయ్, మిడిలార్డర్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీని సెలెక్టర్లు పక్కనబెట్టారు.
భారత జట్టు వివరాలు: ధోనీ (కెప్టెన్), గంభీర్ (వైస్ కెప్టెన్), సెహ్వాగ్, ద్రావిడ్, సచిన్, లక్ష్మణ్, రైనా, యువరాజ్, హర్భజన్, జహీర్ఖాన్, శ్రీశాంత్, ప్రవీణ్ కుమార్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, మునా పటేల్, వృద్ధిమాన్ సాహా, అభినవ్ ముకుంద్.