హరారే వేదికగా జరిగిన రెండే వన్డే మ్యాచ్లో పర్యాటక పాకిస్థాన్ జట్టుకు జింబాబ్వే జట్టు షాకిచ్చింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య జింబాబ్వే విజయభేరీ మోగించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి.
ఈ సిరీస్లో భాగంగా శనివారం రెండో మ్యాచ్ జరిగింది. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆతిథ్య జట్టు 5 పరుగుల తేడాతో పాక్పై గెలిచి.. సిరీస్ను 1-1తో సమం చేసింది. చిబాబా (90), చిగుంబర (67) రాణించడంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 276 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో పాక్.. 48 ఓవర్లలో 256/8 స్కోరు వద్ద ఉండగా.. వెలుతురు మందగించడంతో మ్యాచ్ను నిలిపివేశారు. తర్వాత డక్వర్త్ ప్రకారం పాక్ లక్ష్యాన్ని 48 ఓవర్లలో 262 పరుగులుగా నిర్దేశించారు. దీంతో అప్పటికి 256 రన్స్ మాత్రమే చేసిన పాక్ ఓటమి పాలైంది. షోయబ్ మాలిక్ (96 నాటౌట్) శ్రమ వృథా అయింది.