బంగ్లాదేశ్ టూర్లో భారత జట్టు ఓటమితో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై వెల్లువెత్తుతున్న విమర్శలకు అడ్డుకట్ట వేసే రీతిలో సురేష్ రైనా వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన మ్యాచ్లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన రైనా, ఆ తర్వాత జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ధోనీపై వెల్లువెత్తుతున్న విమర్శలపై విరుచుకుపడ్డాడు.
ఒక్క సిరీస్ ఓటమికే ఇంత రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఓటమిని కాదు, ఆయన సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలని సూచించారు. ధోనీ టీమిండియాకు చిరస్మరణీయ విజయాలెన్నో అందించాడని గుర్తుచేశాడు. అతడు సాధించిన విజయాలను చూసైనా అతడిని విమర్శించకూడదని, అతడు విజయవంతమైన కెప్టెనే కాదు మానవత్వమున్న నాయకుడని, నిజాయితీ కలవాడని పొగిడాడు.
ఒకే ఒక్క సిరీస్ అతడిని చెడ్డవాడిగా నిర్ధారించకూడదని అన్నాడు. డ్రెస్సింగ్ రూంలో అతడంటే అందరికీ ఇష్టమే అని రైనా తెలిపాడు. కాగా వన్డే జట్టు వైస్ కెప్టెన్ గానే కాక టెస్టు జట్టు కెప్టెన్ గానూ వ్యవహరిస్తున్న టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా ధోనీపై పరోక్ష విమర్శలు చేయడం గమనార్హం.