ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖవాజా వెకిలి చేష్టలతో బుక్కైపోయాడు. కివీస్తో ఈ నెల ఆరో తేదీన 6న వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో అరంగేట్రం చేసిన లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు స్వాగతం పలికేందుకు ఖవాజా వెకిలి చేష్టలు చేయడం ఆలస్యంగా వెలుగు చూసింది. మ్యాచ్ మొదలవ్వడాని కి ముందు జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.
అసలు విషయం ఏమిటంటే.. ఆసీస్ ఆటగాళ్లందరూ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకొని జాతీయ గీతం అలపిస్తుండగా, ఖవాజా మాత్రం తనకు ఎడమ వైపున ఉన్న జంపా వెనుక భాగంలో చేయి వేశాడు. జంపా పిరుదులపై అసభ్య రీతిలో చేతిని కదిలించాడు.
మొదట యాదృశ్ఛికంగా చేయి వేశాడని అనుకున్నా... ఖవాజా చాలా సేపటి వరకూ చేతిని కదిలిస్తూనే ఉన్నాడు. సహచరుడి చేష్టలతో జంపా ఇబ్బంది పడినా.. గీతాలాపన ముగిశాక నవ్వడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అయితే ఆసీస్ టీమ్కు దగ్గర్లో కూర్చున్న ఓ అభిమాని ఈ తతంగాన్నంతా వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోకు దాదాపు రెండు లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. దీంతో సహచరుడితో తన చేష్టలను ఖవాజా సమర్థించుకున్నాడు.
అరంగేట్రం ఆటగాడిని ఆట పట్టించడానికే అలా చేశానని ట్వీట్ చేశాడు. ‘మా వెనకాల నుంచి కెమెరాలతో చిత్రీకరించడాన్ని నమ్మలేకపోతున్నా. అదంతా ఇద్దరి అంగీకారంతో జరిగింది. కేవలం అరంగేట్రం ఆటగాడిని ఆట పట్టించానంతేన’ని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో వింత చోటు చేసుకుంది. కంటెర్బరీ క్రికెట్ మైదానంలో బాప్చైల్డ్ జట్టు, క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ జట్టు మధ్య జరిగిన మ్యాచ్లో ఈ వింత చోటుచేసుకుంది. ఇంగ్లీషు క్రికెట్ జట్టు బ్యాటింగ్కు బరిలోకి దిగి 20 బంతులను ఎదుర్కొని 10 వికెట్లను కోల్పోయింది. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే అసలు ఖాతా తెరవకుండానే ఆలౌటైంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసి 120 పరుగులు చేసిన ప్రత్యర్ధి జట్టు 120 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రపంచ క్రికెట్లోని ఈ వింత సంఘటన కెంట్ ప్రాంతీయ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో చోటుచేసుకుంది. ఈ విషయం తెలియడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆశ్చర్యపోయింది. అంతేకాదు తన ట్విట్టర్ ద్వారా స్కోరు బోర్డుని కూడా పోస్టు చేసింది.