ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అవినీతికి పాల్పడ్డాడంటూ ముంబైకి చెందిన హికెన్ షాపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు చెందిన ప్రవీణ్ తాంబేను ప్రలోభపెట్టేందుకు షా ప్రయత్నించాడని నిర్ధారణ కావడంతో బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. షా తనను కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ 'ఆఫర్' చేసిన విషయాన్ని తాంబే నిజాయితీగా తన ఫ్రాంచైజీకి తెలియజేశాడు. దీంతో, ఈ అంశంపై బీసీసీఐ సీరియస్గా దృష్టి పెట్టింది.
కాగా 30 ఏళ్ల హికెన్ షా ప్రస్తుతం ఏ ఫ్రాంచైజీ తరపున ఆడట్లేదు. ముంబై తరపున 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడిన హికెన్ షా 2160 పరుగులు సాధించాడు. ఐపీఎల్ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ కరప్షన్ కోడ్ను షా ఉల్లంఘించినట్టు తేలిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంతేగాకుండా తక్షణమే అతడిపై సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని బీసీసీఐ వెల్లడించింది.