టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ.. కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఓవర్ టేక్ చేసాడు. ఇప్పటికే మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి కోహ్లీ అర్హుడని, వన్డే, ట్వంటీ-20 ఫార్మాట్ల నుంచి ధోనీ తప్పుకోవాలని విమర్శలొస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఈఎస్పీఎన్ విడుదల చేసిన టాప్-100 గ్లోబల్ స్పోర్ట్స్ పర్సన్ జాబితాలో కోహ్లీ 8వ స్థానంలో నిలిచాడు. ఇక మహేంద్ర సింగ్ ధోనీని 14వ స్థానంలో నిలిచాడు.
క్రీడాకారుల సంపాదన, ఎండార్స్మెంట్, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్, గూగుల్ శోధనలో ప్రాచుర్యాన్ని బట్టి ఈఎస్పీఎన్ ఈ జాబితా రూపొందించింది. ఈ జాబితాలో భారత అగ్రశ్రేణి టెన్నిస్ తార, హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా 41వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇద్దరు క్రికెటర్లకు.. అదీ భారతీయ క్రికెటర్లే ఈ జాబితాలో స్థానం సంపాదించడం గమనార్హం.
ఇంకా ఈ జాబితాలో 92 మంది పురుషులుండగా, 8 మంది మాత్రమే మహిళలు స్థానం దక్కించుకోగలిగారు. సాకర్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.