భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు బాంబే హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఈనెల 30వ తేదీ తర్వాత నిర్వహించే అన్ని ఐపీఎల్ మ్యాచ్లను మహారాష్ట్ర నుంచి తరలించాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణను మహారాష్ట్ర నుంచి తరలించనున్నారు.
ప్రస్తుతం మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్నాయి. అందువల్ల మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అనుమతించేది లేదని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. అర్థంతరంగా ఇప్పుడు మ్యాచ్లను తరలించడమంటే పెను సవాల్తో కూడుకున్నదని బీసీసీఐ విన్నవించినా కోర్టు అంగీకరించలేదు.
మ్యాచ్లకు అనుమతిస్తే తాము రోజుకూ 40 లక్షలకు పైగా లీటర్ల నీటిని లాతూర్ సహా ఇతర ప్రాంతాలకు తాము సరఫరా చేస్తామని బీసీసీఐ కోర్టుకు తెలిపింది. దీంతోపాటు కరువు సహాయనిధి కింద ముంబై, పుణె ఫ్రాంచైజీలు చెరో రూ.5 కోట్లను రాష్ట్రానికి అందజేస్తాయని కూడా కోర్టుకు వివరించింది.
అయినా, కూడా కోర్టు మాత్రం మ్యాచ్ల నిర్వహణకు అంగీకరించలేదు. ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరిగే మ్యాచ్లన్నింటినీ వేరేచోటకు తరలించాలని జస్టిస్ వీఎమ్ కనడె, జస్టిస్ ఎమ్ఎస్ కార్నిక్లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఆదేశాలు జారీచేసింది. తాజా కోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 30లోపు కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే మహారాష్ట్రలో నిర్వహించనున్నారు.