ట్వంటీ-20లో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు... శ్రీలంకపై 20 ఓవర్లలో 263/3
అంతర్జాతీయ ట్వంటీ-20 పోటీల్లో ఆస్ట్రేలియా సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. శ్రీలంక గడ్డపై ఆతిథ్య జట్టుతో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు గతంలో శ్రీలంక పేరిట ఉన్న రికార్డును తిరగరాస
అంతర్జాతీయ ట్వంటీ-20 పోటీల్లో ఆస్ట్రేలియా సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. శ్రీలంక గడ్డపై ఆతిథ్య జట్టుతో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు గతంలో శ్రీలంక పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్మెన్ గ్లెన్ మాక్స్వెల్ బౌండ్రీల సునామీలో ట్వంటీ-20 ఫార్మెట్లో ఆసీస్ జట్టు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరటి ఉండేది.
రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా, మంగళవారం జరిగిన తొలి టీ20లో 65 బంతుల్లోనే 14 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 145 పరుగులు చేసిన మాక్స్వెల్ వీరవిహారానికి తోడు ట్రేవిస్ హెడ్ (18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48) వీరవిహారం తోడవడంతో లంకతో తొలి టీ-20లో ఆసీస్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 263 రన్స్ చేసి కొత్త చరిత్ర లిఖించింది.
దీంతో 2007 టీ-20 వరల్డ్క్పలో కెన్యాపై శ్రీలంక నెలకొల్పిన 260/6 పరుగుల రికార్డు తెరమరుగైంది. అంతేకాకుండా ఈ ఫార్మాట్లో ఐపీఎల్ జట్టు బెంగళూరు పేరిట ఉన్న (2013లో పుణెపై 263/5) అత్యధిక స్కోరు రికార్డును ఆసీస్ సమం చేసింది. చివరి బంతికి హెడ్ అవుటవడంతో ఆసీస్ ఈ మార్కును దాటలేకపోయింది. ఇక, టీ-20ల్లో అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగాడిగా మాక్స్వెల్ నిలిచాడు.
ఆ తర్వాత లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన శ్రీలంక జట్టు... ఓవర్లన్నీ ఆడి తొమ్మిది వికెట్లకు 178 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో, ఆసీస్ 85 పరుగులతో జయభేరి మోగించింది. ఛేదనలో కెప్టెన్ చాందిమల్ (43 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో 58), కపుగెదెర (25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్వెల్కే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో, ఆఖరి టీ-20 ఈనెల 9న జరగనుంది.