టీమిండియాలో స్థానం కోల్పోయిన స్టార్ ప్లేయర్ గౌతం గంభీర్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఒకప్పటి ఫామ్ను అందిపుచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందులో భాగం గౌతం గంభీర్ ఆస్ట్రేలియాలోని పెర్త్లో కఠోర సాధన చేస్తున్నాడు. ఇంకా బ్యాటింగ్ను మెరుగుపర్చుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ఈ ఢిల్లీ స్టార్ గంభీర్.. కంగారూ బ్యాటింగ్ దిగ్గజం జస్టిన్ లాంగర్ పర్యవేక్షణలో ఆటతీరుకు మెరుగులు దిద్దుకుంటున్నాడు.
ఈ సందర్భంగా గంభీర్ మీడియాతో మాట్లాడుతూ.. "నా కోచ్ పార్థసారథి శర్మ మృతి తర్వాత నా బ్యాటింగ్ శైలిని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి కోసం అన్వేషించాను. జస్టిన్ లాంగర్ అందుకు తగిన వ్యక్తి అని అర్థమైంది. అందుకే పెర్త్ వచ్చాను.'' అని చెప్పాడు.
అంతేగాకుండా తాను లాంగర్ కెరీర్ను చాలా దగ్గర నుంచి పరిశీలించాననని ఆయన తన కెరీర్ను అద్భుతంగా మలుచుకున్నాడని గంభీర్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది చాంపియన్స్ లీగ్ సందర్భంగా లాంగర్ పెర్త్ స్కార్చర్స్ జట్టు తరపున భారత్ వచ్చాడు. అప్పుడే ఈ విషయం చర్చించాను" అని గంభీర్ వివరించాడు.