Publish Date: Wed, 08 Apr 2026 (12:41 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (12:44 IST)
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ మ్యాచ్లలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో చేతులెత్తేసింది. దీంతో చిత్తుగా ఓడిపోయింది.
దీనిపై హార్దిక్ పాండ్యా నిర్వేదం వ్యక్తం చేశారు. ఈ ఓటమికి బౌలర్లే కారణమని చెప్పుకొచ్చారు. కనీసం ఐదు మంచి బంతులేసినా తమకు గెలిచే అవకాశం ఉండేదని చెప్పుకొచ్చాడు.
'మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి నుంచే మాకు భారీ షాట్లు ఆడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, మేం బౌలింగ్లోనే సరిగ్గా రాణించలేదు. నాతో సహా మా బౌలింగ్ బృందం విఫలమైంది. ఈ ఓటమికి బౌలింగ్ యూనిట్దే బాధ్యత. కనీసం ఐదు బంతులైనా సిక్సర్లు వెళ్లకుండా కట్టడి చేయాల్సింది. అప్పుడు ముంబై పోరాడేందుకు అవకాశం లభించేది' అని పాండ్య తెలిపాడు.
'రాజస్థాన్ జట్టు గొప్పగా ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు తొలి రెండు ఓవర్లలోనే గేమ్ను మా నుంచి లాగేసుకున్నారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు మేం ప్రయత్నించినా.. వెనకబడిపోయాం' అని హార్దిక్ వివరించాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ముంబై 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 3 వికెట్లకు 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై సీనియర్ బౌలర్లు బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శార్దూల్ ఠాకుర్, దీపక్ చాహర్ తేలిపోయారు. ధారాళంగా పరుగులిచ్చేశారు. ఛేదనలో పాండ్య సేన 123 పరుగులకే పరిమితమై, ఈ సీజన్లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.