Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరంగపట్నం నుంచి శ్రీహరికోట దాకా....

శ్రీరంగపట్నం నుంచి  శ్రీహరికోట దాకా....
అక్షరాలా భారత అంక్షరిక్ష పరిశోధనా చరిత్ర కర్నాటకలోని శ్రీరంగ పట్నం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వరకు పయనించిందంటే బహుశా చాలామంది నమ్మలేరు. నమ్మలేకున్నా ఇది నిజమే.. ఎందుకంటే అంతరిక్షంలోకి ప్రస్తుతం ప్రపంచం నలుమూలలనుంచి దూసుకెళుతున్న రాకెట్‌ల పరిజ్ఞానాన్ని మానవ చరిత్రలో మొదటిసారిగా కనిపెట్టింది మన భారతీయుడే.. మన టిప్పుసుల్తాన్ అనేదే ఆ నమ్మలేని నిజం.

ప్రపంచంలో మొట్టమొదటి .యుద్ధ రాకెట్‌ను కనిపెట్టింది టిప్పు సుల్తానే మరి. 17వ శతాబ్దంలో తన రాజధాని శ్రీరంగపట్నంలో టిప్పుసుల్తాన్ మొదలెట్టిన భారతీయ రాకెట్ మహా ప్రస్థానం ఇప్పుడు చంద్రయాన్1 ప్రయోగ వేదిక అయిన శ్రీహరికోటలో తారాస్థాయికి చేరింది.
నాసాలో టిప్పు సుల్తాన్ చిత్ర పటం
  మరుగున పడిన ఈ భారతీయ మహా యుద్ధ తంత్ర చరిత్రకు పరమ సాక్షీభూతంగా టిప్పు సుల్తాన్ చిత్రపటం అమెరికా అంతరిక్ష కేంద్రమైన నాసాలో ఈ నాటికీ ఉంది. అంతరిక్షానికి, టిప్పుసుల్తాన్ తొలి ప్రయోగానికి, మానవ జ్ఞాన పరంపరకు ఉన్న సంబంధం అది...      


బ్రతికి ఉన్నంతవరకూ భారత్‌లో బ్రిటిష్ సైన్యాలను ముప్పుతిప్పలు పెట్టిన టిప్పు సుల్తాన్ 1799లో కర్నాటకలోని తురకనహళ్లిలో జరిగిన భీకర యుద్ధంలో వీరమరణం పొందిన తర్వాతే ఆయన రూపొందించి అభివృద్ధి చేసిన చరిత్రలో మొట్టమొదటి రాకెట్ కథ బయటి ప్రపంచానికి తెలిసింది.

టిప్పు వీరమరణం తర్పాత ఆయన సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సేనాని విలియం కాంగ్రెస్ ఆ స్థావరంలో 1600 యుద్ధరాకెట్లు కనుగొని నివ్వెరపోయాడు. తమ జ్ఞానానికి మించిన నూతన యుద్ధ తంత్రం ఒక ప్రాచ్యదేశంలో బయటపడగానే తక్షణం ఆ రాకెట్లను ఇంగ్లండ్ తరలించారు. టిప్పు ఆ యుద్ధంలో బతికి ఉంటే అనే ప్రశ్నలు సమాధానం ఇవ్వవు.

కాని ఇంగ్లండ్ చేరిన టిప్పు రాకెట్లతో పాటు దాని పరిజ్ఞానం కూడా దేశం దాటిపోయిందంటే నమ్మాలి మరి. అత్యంత ప్రాథమిక జ్ఞానంతో టిప్పు రూపొందించిన తొలితరం యుద్ధ రాకెట్ కేవలం రెండు కిలోల బరువు ఉండేది. అయిదు సెంటీమీటర్ల వెడల్పు, 25 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఈ రాకెట్‌లో కిలో గన్ పౌడర్ దట్టించి దానినే ఇంధనంగా మండిస్తూ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న శత్రువులను సైతం గడగడలాడించే వారు. మైసూరు సమీపంలోని శ్రీరంగపట్నంలో రాకెట్ లాంచ్‌ప్యాడ్‌లు సైతం ఉండేవని చరిత్రకారుల భావన.

ఆలా మానవ చరిత్రలో మొదటి సారిగా టిప్పుసుల్తాన్ కనుగొన్న యుద్ధ రాకెట్ పరిజ్ఞానం ఆయన అనూహ్య మరణంతో ఆంగ్లేయుల హస్తగతమై 150 సంవత్సరాల పాటు మరుగున పడి ఉండటం మరింత ఆశ్చర్యం గొలిపిస్తుంది. తర్వాత 20వ శతాబ్ది మొదట్లో అంటే 1903లో రష్యాకు చెందిన కాన్‌స్టాంటిన్ షల్కోవస్కీ, అమెరికా సైంటిస్టు రాబర్ట్ గోడాన్ (1914), జర్మనీలో హెర్మన్ ఓబెర్త్‌ (1923) యుద్ధరాకెట్లకు మరితం ఆధునికత జోడించిన ఫలితంగా 1950ల మధ్యలో అంతరిక్ష విజ్ఞానం కొత్త పుంతలు తొక్కింది.

మరుగున పడిన ఈ భారతీయ మహా యుద్ధ తంత్ర చరిత్రకు పరమ సాక్షీభూతంగా టిప్పు సుల్తాన్ చిత్రపటం అమెరికా అంతరిక్ష కేంద్రమైన నాసాలో ఈ నాటికీ ఉంది. 17వ శతాబ్దానికి చెందిన భారతీయ రాజు చిత్రపటానికి నాసాకు ఉన్న సంబంధం ఏమిటి? అంతరిక్షానికి, టిప్పుసుల్తాన్ తొలి ప్రయోగానికి, మానవ జ్ఞాన పరంపరకు ఉన్న సంబంధం అది....

శ్రీరంగ పట్నం టు శ్రీహరి కోట..
టిప్పు మరణం తర్వాత 150 సంవత్సరాలు మన రాకెట్ విజ్ఞానం నిద్రావస్థలోకి జారుకోగా 1962లో చైనా దురాక్రమణకు పాల్పడిన తర్వాత గాని సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఏమిటో మనకు తెలిసిరాలేదు. చైనా సైనిక పాటవం ముందు మన బలగాల సామర్థ్యం కొరగానిదని తేలిపోయిన క్షణంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టి ఆ బాధ్యతలను ప్రొఫెసర్ విక్రం సారాబాయ్‌కి అప్పగించారు.

1962లోనే సారాబాయ్ సారథ్యంలో కేరళలోని తుంబా అనే ఓ మత్స్యకారులు గ్రామంలో దేశ చరిత్రలో తొలి రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటైంది. ఆ తర్వాత సొంత ఉపగ్రహాలను ప్రయోగించడానికి మరో కొత్త స్థలంకోసం జరిపిన అన్వేషణలో సారాబాయ్ కళ్లకు శ్రీహరికోట తగిలింది.

1969లో విమానంలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా సారాబాయ్ శ్రీహరికోట దీవులను గుర్తించడం అక్కడే షార్ కేంద్రం ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. 1969 నుంచి షార్ ప్రాజెక్టు కార్యక్రమాలు బుడిబుడి నడకలతో వేగం పుంజకున్నాయి. 1979లో తొలి ఎస్ఎల్‍వీ 3ఈ 1 రాకెట్ ప్రయోగం జరిగింది. అప్పటినుంచి శ్రీహరికోటలోని షార్ కేంద్రంనుంచి 25 రాకెట్ ప్రయోగాలు జరిగాయి.

చంద్రయాన్ -1 ప్రయోగంతో భారతీయ స్వప్నాల సాకారం
ఈ బుధవారం ఉదయం బాలభానుడి లేతకిరణాలు భూమ్మీద ఇంకా ప్రసరించకముందే చంద్రయాన్ 1 ప్రయోగంలో భాగమైన పీఎస్ఎల్‌వి సీ11 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మరో బృహత్తర ఘట్టానికి వేదికగా మారింది

ఒకనాడు ఉపగ్రహ ప్రయోగాలకు పరాయి దేశాలపై ఆధారపడిన భారత్ నేడు స్వావలంబన సాధించడమే కాక విదేసీ శాటిలైట్లను సైతం రోదసీకి పంపగల సాంకేతిక పరిజ్ఞానాన్ని తన సొంతం చేసుకుంది. ఇజ్రాయెల్, ఇటలీ, ఇండోనేషియా, అర్జెంటైనా, బెల్జియం, కెనడా, జపాన్, జర్మనీల ఉపగ్రహాలను సొంత రాకెట్లతో ప్రయోగించి అంతర్జాతీయంగా తన సత్తాను చాటుకుంది.

ఇప్పటిదాకా ఇస్రో సాధించిన విజయాలన్నీ ఒకెత్తు. చంద్రయాన్1 ప్రయోగం ఒకెత్తు. భవిష్యత్తులో మానవ సహిత ఉపగ్రహాన్ని చంద్రునిపైకి పంపే బృహత్తర లక్ష్యంతో మొదలైన చంద్రయాన్ -1 తన మొదటి గమ్యాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.

Share this Story:

Follow Webdunia telugu