బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం వల్ల సోమవారం లోహం ధర రూ.15 తగ్గింది. దీంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,660కి చేరింది. అంతర్జాతీయంగా సింగపూర్ మార్కెట్లో సైతం దీని ధర 0.3శాతం తగ్గింది. దీంతో ఔన్సు బంగారం ధర 1,136 అమెరికన్ డాలర్లకు చేరింది. అయితే, వెండి ధరలు పెరిగాయి. రూ.100 పెరగడంతో కేజీ వెండి ధర రూ.36,000కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 25 పాయింట్లు నష్టపోయి 26,192 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ నాలుగు పాయింట్లు నష్టపోయి 7,977 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.64గా ఉంది. క్రూడాయిల్ లాభపడగా బంగారం, వెండి, సహజవాయువులు నష్టాలతో ముగిశాయి. హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, గెయిల్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, బాష్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.