Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హమ్మయ్యా.. స్టాక్ మార్కెట్ కోలుకుంది.. 290 పాయింట్ల వృద్ధి!

హమ్మయ్యా.. స్టాక్ మార్కెట్ కోలుకుంది.. 290 పాయింట్ల వృద్ధి!
, మంగళవారం, 25 ఆగస్టు 2015 (16:43 IST)
చైనా ఆర్థిక మాంద్య ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ మెల్లగా కోలుకుంది. ఫలితంగా మంగళవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి 290 పాయింట్ల మేరకు లాభపడి ముగిసింది. అలాగే, నిఫ్టీ కూడా 71 పాయింట్ల మేరకు వృద్ధి సాధించింది. అలాగే డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పెరిగింది. చైనా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కారణంగా సోమవారం భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనమైన విషయంతెల్సిందే. దీంతో బ్లాక్ మండేగా నమోదైన సోమవారం ఒక్కరోజే 7 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైపోయింది. 
 
ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే... 350 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, ఆ తరువాత రెండు గంటల వ్యవధిలో నష్టాల్లోకి, మరో గంట గడిచేసరికి 300 పాయింట్లకు పైగా నష్టం. అక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో మార్కెట్ బుల్ జంప్, కాసేపు ఒడిదుడుకులు, ఒంటిగంట దాటేసరికి తిరిగి లాభాల్లోకి... చివరికి 290 పాయింట్ల లాభంతో మంగళవారం ట్రేడింగ్ ముగిసింది. 
 
మొత్తానికి మంగళవారం ట్రేడింగే ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 290.82 పాయింట్ల వృద్ధితో 1.13 శాతం లాభంతో 26,032.38 పాయింట్ల వద్ద, నిఫ్టీ 71.70 పాయింట్లు పెరిగి 0.92 శాతం లాభంతో 7,880.70 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ సెషన్లో సెన్సెక్స్ 26,116.90 పాయింట్ల గరిష్టాన్ని, 25,314.94 పాయింట్ల కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ట్రేడింగ్‌లో ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, వీఈడీఎల్, బీపీసీఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, టాటా పవర్, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 

Share this Story:

Follow Webdunia telugu