ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా దేశీయ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారం నిస్తేజంగానే కొనసాగుతున్నప్పటికీ.. లగ్జరీ ఫ్లాట్లు, ప్రముఖ భవనాల విక్రయ లావాదేవీల్లో మాత్రం సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ముంబైలోని లింకన్ హౌజ్ను పుణెకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ పూణావాలా ఏకంగా రూ.750 కోట్లకు కొనుగోలు చేశారు. ముంబై రియల్టీ మార్కెట్లో ఇప్పటివరకిదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందంగా చరిత్రపుటలెక్కింది.
ఇటీవల కుమార మంగళం బిర్లా.. ముంబైలోని మలబార్ హిల్స్లో ఉన్న జతియా హౌజ్ను రూ.425 కోట్లకు కొనుగోలు చేసిన విషయాన్ని మరచిపోకముందే.. ఈ పూణె పారిశ్రామికవేత్త బిర్లా రికార్డును బద్దలు కొట్టారు. దక్షిణ ముంబైలోని బ్రీచ్క్యాండీ ప్రాంతంలో ఉన్న లింకన్ హౌజ్.. కొన్ని దశాబ్దాల పాటు అమెరికా కాన్సులేట్ కార్యాలయంగా ఉండేది.
అమెరికా ప్రభుత్వం 2011లో కాన్సులేట్ను బీకేసీకి మార్చింది. అప్పటి నుంచే ఈ భవానాన్ని అమ్మకానికి పెట్టారు. రెండు ఎకరాల్లో, 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన లింకన్ హౌజ్ను గ్రేడ్-3 చారిత్రక భవనాల జాబితాలోకి చేర్చారు. అయితే ఈ గ్రేడ్ బిల్డింగ్లను పునరుద్ధరించేందుకు అనుమతి ఉంది. లింకన్ హౌజ్ను కుటుంబ నివాసంగా మార్చుకోవాలన్నదే ఈ పారిశ్రామికవేత్త భావనగా ఉంది.