ప్రభుత్వ విద్యుత్ కంపెనీ అయిన ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కేజీ డీ6 బేసిన్ నుంచి రోజకు దాదాపు 15.1 లక్షల ఘనమీటర్ల గ్యాసును కొనుగోలు చేసే అవకాశాలున్నాయని ఎన్టీపీసీ వర్గాలు తెలిపాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన కేజీ బేసిన్ నుంచి గ్యాస్ కొనుగోలు చేసేందుకు 4.2 డాలర్లను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధపడ్డట్టు ఎన్టీపీసీ అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం కొనుగోలు చేసే ఈ గ్యాస్ను ఎన్టీపీసీకి చెందిన రాజస్థాన్లోని అంతా, ఔరయ్యా ప్రాంతాలు, దాదరీ(ఉత్తరప్రదేశ్), ఫరీదాబాద్(హర్యానా) ప్రాంతాలలోనున్న ఎన్టీపీసీ కర్మాగారాల్లో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
గతంలో ఇరు సంస్థలు గ్యాస్ కొనుగోలుపై సంతకాలు చేసాయని, మరింత ఎక్కువగా కొనుగోలు చేయనున్న గ్యాస్కు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయాల్సివుందని అధికారులు తెలిపారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు కొనుగోలు చేయాల్సిన గ్యాస్ రోజుకు 18.1 లక్షల ఘనమీటర్ల గ్యాస్. అదనంగా కొనుగోలు చేసే గ్యాస్కు సంబంధించి వచ్చే వారంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం రిలయన్స్కు చెందిన కేజీ డీ6 బేసిన్ నుంచి ఎన్టీపీసీకి రోజుకు 44.6 లక్షల ఘనమీటర్లను కొనుగోలుచేసేందుకు సిద్ధమైంది. కాని విద్యుత్ కంపెనీ ఎన్టీపీసీ ఇప్పటి వరకు రోజుకు కేవలం 18.1 లక్ష ఘనమీటర్ల గ్యాస్ మాత్రమే వినియోగించుకుంటోంది. మిగిలిన గ్యాస్ను వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఎన్టీపీసీకి అదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.