పార్లమెంట్ వార్షిక బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. దాదాపు రెండున్నర నెలల పాటు సాగిన ఈ సమావేశాల్లో 2010-11 ఆర్థిక బిల్లుకు ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే. పలు అడ్డంకులు, నిరసనల మధ్య గంటల కొద్ది సమయం వృధా అయింది. లోక్సభలో 70 గంటలు, రాజ్యసభలో 45 గంటల సమయాన్ని సభ్యులు తమ నిరసన కార్యక్రమాల ద్వారా వృధా చేశారు.
ప్రధానంగా మహిళా బిల్లు, అణు ప్రమాద పరిహార బిల్లు, ధరల పెరుగుదల, పెట్రో ధరల పెంపు, స్పెక్ట్రమ్ కుంభకోణం తదితర అంశాలపై సభా సమయం హరించుకుపోయింది. మొత్తంగా పార్లమెంటు సమావేశాల పరిస్థితిని పరిశీలిస్తే అడ్డంకులు సృష్టించడం వల్ల వాయిదా వేయాల్సిరావడం, రభస జరగడం లాంటి సంఘటనలు చాలా సమయం వృధాగా పోయినట్టు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తెలిపారు. చట్టసభల ప్రతిష్టతను ఇలాంటి చర్యలు మరింతగా దిగజార్చుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.