ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం నుంచి తమ దేశం గట్టెక్కినట్లేనని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా పలు దేశాల్లోని వ్యాపార రంగాలు అతలాకుతలమైనాయి. ఇందులో భాగంగా బ్రిటన్లోను పలు ఆర్థిక సంస్థలు మాంద్యాన్ని చవిచూసాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాతి కాలంలో బ్రిటన్ చవిచూసిన అతి ఘోరమైన మాంద్యం నుంచి గట్టెక్కినట్లు అధికారికంగా ప్రకటించారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక వృద్ధి రేటు నమ్మశక్యం కానివిధంగా 0.1 శాతం మాత్రమే నమోదు కావడం మరో నాలుగు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రధాని గార్డన్ బ్రౌన్ నేతృత్వంలోని లేబర్ పార్టీని ఆశల పల్లకిలో ఊరేగించేటట్లు కనిపించడం లేదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
గత సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 0.1% మేరకు వృద్ధి చెందిందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గత 18 నెలలుగా బ్రిటన్ మాంద్యం గుప్పిట్లో విలవిలలాడింది.. ఆ కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 13 లక్షలకు చేరుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి.