రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో యునైటెడ్ వరల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పాటు కానుంది. సరళీకృత ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉన్న అపార ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు వీలుగా రూపకల్పన చేసిన ఎంబీఏ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో బిజినెస్ స్కూల్ను ఏర్పాటు చేయనున్నట్టు ఆసంస్థ పేర్కొంది.
దీనిపై యునైటెడ్ వరల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరక్టర్ ప్రొఫెసర్ త్రిదిబేష్ మాట్లాడుతూ.. రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు అడ్మిషన్లు ప్రారంభమైనట్టు తెలిపారు. ఇప్పటికే అహ్మదాబాద్, కోల్కతా, ముంబై సెంటర్లను ఏర్పాటు చేశామని, ఈ మూడు సెంటర్లలో 360 మంది విద్యార్ధులు కోర్సులో తొలి సంవత్సరాన్ని పూర్తి చేశారని ఆయన గుర్తు చేశారు.
యునైటెడ్ వరల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో రెండేళ్ళ ఎంబీఏ కోర్సును పూర్తి చేసేందుకు ఫీజు రూపంలో 5.5 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు పట్టాలు ఇచ్చేందుకు పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు త్రిదిబేష్ వెల్లడించారు.