ప్రభుత్వ పెట్రోలు ఉత్పత్తుల కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ఉత్పాదక ధరలకన్నా తక్కువ ధరలకు పెట్రోలు, డజీల్, ఎల్పీజీ గ్యాస్, కిరోసిన్లను విక్రయిస్తుండటంతో రోజుకు రూ. 94 కోట్లు నష్టపోతోంది.
ఐఓసీ అధ్యక్షుడు సార్థక్ బెహురియా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం తమ సంస్థలో రిఫైనరీ మార్జిన్ పడిపోయిందని, ఎల్పీజీ గ్యాస్, కిరోసిన్లను తక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో నష్టాలను భర్తీ చేసేందుకు బాండ్లు అందుకోవలసి ఉందని చెప్పారు.
పెట్రోలియం ఉత్పత్తులు తక్కువ ధరలకు విక్రయిస్తున్నందువల్ల రోజుకు రూ. 94 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 26,490 కోట్లు నష్టపోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాలలో ఎల్పీజీ, కిరోసిన్ అమ్మకాలలో నష్టాలను పూడ్చుకునేందుకు బాండ్లను అందుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
కాగా తమ కంపెనీలకు వస్తున్న నష్టాల గురించి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు తెలిపామని, రానున్న రోజుల్లో తమకు బాండ్లు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దీంతో ఐఓసీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాలకుగాను రూ. 11,852 కోట్ల ఆయిల్ బాండ్లు లభిస్తాయని, అదే బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలకు మొత్తంగా రూ. 9019 కోట్లు ప్రభుత్వ బాండ్లు లభిస్తాయని ఆయన వివరించారు.