Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పర్యాటక కేంద్రాల నెలవు తిరుపతి

పర్యాటక కేంద్రాల నెలవు తిరుపతి
, గురువారం, 24 జులై 2008 (14:29 IST)
తిరుపతి పేరు తెలియనివారు దేశంలోనే ఉండరంటే అతిశయోక్తి కాదేమో. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల పాదాల చెంత వెలసిన తిరుపతి పట్టణం నిత్యం భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. అయితే తిరుపతికి విచ్చేసిన చాలామంది తిరుమలలోని స్వామివారిని దర్శించుకుని వెళ్లిపోతుంటారు.

అయితే ఓ రోజు కేటాయించి తిరుపతిలో విహరించగల్గితే ఎన్నో దేవాలయాలు, మరెన్నో పర్యాటక ప్రదేశాలు మనకు మరింత ఆనందాన్ని పంచిపెడుతాయి. అందుకే తిరుపతిలో చూడదగ్గ కొన్ని ముఖ్య ప్రదేశాలను ఇక్కడ వివరిస్తున్నాం.

తిరుపతిలో ముఖ్యమైన దేవాలయాలు
తిరుపతిలో ముఖ్యమైన దేవాలయాలుగా గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం, తిరుచానూరులను చెప్పుకోవచ్చు. తిరుమలకు విచ్చేసిన భక్తుల్లో అధికభాగం ఈ మూడు క్షేత్రాలను దర్శించడానికి సైతం అత్యంత ఆసక్తి కనబరుస్తుంటారు.

కపిలతీర్థం
తిరుపతిలోని ప్రధాన బస్‌ స్టేషన్ నుంచి తిరుమలకు వెళ్లే దారిలో దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో కపిలతీర్థం ఉంది. ఇక్కడ శివుడు కపిలేశ్వరుని రూపంలో కొలువై ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఓ జలపాతం సైతం ఉంది. పైనుంచి జాలువారే జలపాతంలో తనివితీరా స్నానం చేసి అటుపై శివుని దర్శించడం భక్తుల ఆనవాయితీ.

అలాగే విశాలమైన ఈ క్షేత్రంలో శివునితోపాటు ఇతర దేవతలు కూడా కొలువైఉన్నారు. ఇక్కడ యాత్రికులు విశ్రమించడానికి అనువుగా ఉద్యానవనం కూడా ఉంది.

గోవిందరాజస్వామి ఆలయం
తిరుపతిలో యాత్రికులు తప్పకుండా దర్శించాల్సిన మరో ఆలయం గోవిందరాజ స్వామి ఆలయం. వెంకటేశ్వర స్వామికి అన్నగా పేర్కొనే గోవిందరాజస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. శయానాకారంలో ఉండే గోవిందరాజస్వామి దివ్యమంగళ స్వరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.


విశాలంగా ఉండే ఈ దేవాలయంలో ఇంకా ఇతర దేవాతా మూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న అద్భుత శిల్పకళను వీక్షించిన వారికి మనసంతా సంభ్రమాశ్చర్యాలతో నిండిపోతుంది. ఈ దేవాలయం పట్టణం నడిబొడ్డునే ఉంది. తిరుపతిలోని ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి ఈ దేవాలయం చాలా దగ్గరగానే ఉంది.

తిరుచానూరు
తిరుపతి పట్టణానికి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీవేంకటేశ్వరుని భార్యగా పేర్కొనబడే పద్మావతీ అమ్మవారు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. తిరుపతిలోని ప్రధాన బస్సు కేంద్రం, రైల్వే స్టేషన్ నుంచి ఈ క్షేత్రానికి ఎల్లప్పుడూ బస్సులు అందుబాటులో ఉంటాయి.

దేవాలయాలతో పాటు తిరుపతిలో విహార స్థలాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రెండింటి గురించి చెప్పుకోవచ్చు. అవి ఆంధ్రప్రదేశ్ టూరిజంశాఖచే నిర్వహించబడుతోన్న అర్బన్ హాట్ అనే ప్రదేశం. సుందరంగా తీర్చిదిద్ది బడిన ఈ ఉద్యానవనంలో పర్యాటకుల స్వేచ్ఛగా విహరించవచ్చు.

అంతేకాకుండా చేతితో తయారు చేసిన వివిధ వస్తువులు, కళారూపాలు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ బోట్ షికారు కూడా అందుబాటులో ఉంది. పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన క్రీడా పరికరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. తిరుపతి నుంచి తిరుచానూరుకు వెళ్లే దారిలో రహదారిప్రక్కనే ఈ ప్రదేశం ఉంది.

అలాగే తిరుపతి నుంచి కరకంబాడికి వెళ్లే రహదారిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఎమ్యూజ్‌మెంట్ పార్క్ సైతం పర్యాటకులకు చక్కని ఆనందాన్ని పంచడానికి సిద్ధంగా ఉంది. ఇన్ని విశేషాలు కల్గిన తిరుపతిని చుట్టి చూడగల్గితే అంతులేని ఆనందం మీ సొంతమవుతుంది.

అందుకే మీరు తిరుమల క్షేత్రాన్ని దర్శించాలనుకునేటప్పుడు మరో రెండురోజులను ఎక్కువగా కేటాయించగల్గితే తిరుపతిలోని పర్యాటక ప్రదేశాలను సైతం తిలకించి ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu